విశాఖ స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించేందుకు కేంద్రం కొత్త ప్లాన్!

  • గత కొన్నాళ్లుగా నష్టాల బాటలో విశాఖ ఉక్కు పరిశ్రమ
  • ప్రైవేటీకరణ నిర్ణయంతో భగ్గుమన్న కార్మిక సంఘాలు
  • ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్న కేంద్రం
నష్టాలతో భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో విలీనం చేయాలన్నది ఆ ప్రత్యామ్నాయాల్లో ఒకటి. ఉక్కు పరిశ్రమకు చెందిన 1500 ఎకరాల నుంచి 2 వేల ఎకరాల వరకు భూమిని ఎన్ఎండీసీకి విక్రయించడం, బ్యాంకు లోన్లు వంటి ప్రత్యామ్నాయాలు కూడా కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. 

కాగా, విశాఖ ఉక్కు పరిశ్రమకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేంద్రం వర్గాలు తెలిపాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉందని, దీన్ని సెయిల్ కు అప్పగించాలన్న ఆలోచన ఉందని ఆ వర్గాలు వివరించాయి. 

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై పోరాడుతున్న కార్మికులు కూడా సెయిల్ లో విలీనం చేయాలని కోరుతున్నారు. దేశంలోని ఇతర ఉక్కు పరిశ్రమల లాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు లేకపోవడం నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

Vizag Steel Plant
SAIL
Merge
Centre
Andhra Pradesh

More Telugu News